మహారాణిపేట: జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 86.49 శాతం మాత్రమే స్వీయ గణన పూర్తయిందని, దీనిని తక్షణమే 100 శాతానికి చేర్చాలని స్పష్టం చేశారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే ప్రధాన జనగణన ప్రక్రియకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని, మొబైల్ అప్లికేషన్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ విధుల్లో ఎవరికీ మినహాయింపు ఉండదని, సిఫార్సులకు తావులేదని హెచ్చరించారు. సమావేశంలో జేసీ విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, ఆర్డీవోలు సంగీత మాధుర్, శైష శైలజ, సీపీవో శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


