విశాఖ సిటీ : అభివృద్ధి పనుల వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు పనుల్లో భాగంగా అడవివరం–శొంఠ్యాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే విద్యుత్ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ లైన్ల పనులు చేసేటప్పుడు నిచ్చెనలు, బెల్టులు, సేఫ్టీ హెల్మెట్లు వాడాలి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో ఉంది. క్రేన్ చివరున సిబ్బంద్తిని కూర్చోబెట్టి ఏకంగా గాల్లోకి లేపుతున్నారు. సదరు సిబ్బంది ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా, కేవలం ఆ క్రేన్ హుక్కును పట్టుకుని ప్రమాదకర స్థితిలో పనులు చేస్తున్నారు. ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు భారీగా సాగుతున్నాయి. ఒకవైపు వాహనాలు వెళ్తుండగానే, మరోవైపు ఇంత సాహసోపేతంగా పనులు చేయడం చూసి వాహనదారులు విస్తుపోతున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?’ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికై నా భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


