ఆరిలోవ: ప్రముఖ రచయిత, అనువాదకుడు ఎల్.ఆర్.స్వామి మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం తుదిశ్వాస విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆదివారం విశాలాక్షినగర్ వెటర్నరీ కాలనీలోని ఆయన రెండో కుమార్తె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ వై.విజయకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు ఎన్.అంజయ్య, సీపీఐ జిల్లా నాయకుడు ఎం.పైడిరాజు తదితరులు స్వామి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, విశాలాంధ్ర ముద్రణాలయం ద్వారా స్వామి అనువదించిన పుస్తకాలను ప్రచురించామని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా అర్ధనారీశ్వరుడు గ్రంథ అనువాదం కోసం ఆయన ఎంతగానో శ్రమించారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.


