మద్దిలపాలెం: సామాజిక, మేధో ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచిందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఎన్నో తరాలను తీర్చిదిద్దిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికే సొంతమని, దేశంలోనే నంబర్ 1 వర్సిటీగా ఏయూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖతోనూ, ఏయూతోనూ తనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. అంతకుముందు వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి సీఆర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ ఫస్ట్ అనే నినాదంతో అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.వి.రావు మాట్లాడిన కార్యక్రమంలో జైపూర్ రాజవంశీయులు మయూఖ కుమారి దేవి, పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనబరిచిన ఆచార్యులకు ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ అవార్డులు, అలుమ్ని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.
హెచ్ఆర్డీ కార్యదర్శి కోన శశిధర్


