ఏయూ క్యాంపస్ : సాగరతీరం భక్తిరసంతో మునిగిపోయింది. ‘జై శ్రీరామ్’ నినాదాలతో బీచ్రోడ్ మార్మోగిపోగా.. నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు కాషాయ జెండాలతో శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయం, ఆధ్యాత్మికత, ఐక్యత కలిసిన ఈ మహోత్సవం శనివారం సాయంత్రం కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ లోకానికి మార్గదర్శకుడు శ్రీరామచంద్రుడు ఆదర్శ రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడని కొనియాడారు. శ్రీరాముని పాలన ప్రజలకు న్యాయం, ధర్మం, సమానత్వం కలిగించిన ఆదర్శమని పేర్కొన్నారు. హనుమంతుని నిస్వార్థ సేవ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని సూచించారు. ఈ శోభాయాత్రలో రామనామ స్మరణ, హనుమ జపాలతో నగరం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో తేలిందన్నారు. యువతపై దృష్టి సారిస్తూ, దేశ అభివృద్ధిలో వారి పాత్రను హైలైట్ చేశారు. ‘‘యువతలో అపారమైన శక్తి దాగి ఉంది. దాన్ని గుర్తించి వెలికితీయడం గురువుల బాధ్యత. యువతతోనే వికసిత భారత్ లక్ష్యం సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కనులపండువగా శ్రీరామ శోభాయాత్ర


