మురళీనగర్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పాలిసెట్–2026 ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 44 కేంద్రాల్లో 14,759 మంది విద్యార్థులకు గాను 14,118 మంది హాజరయ్యారు. దీంతో జిల్లాలో 95.66 శాతం హాజరు నమోదైంది. జిల్లా కో–ఆర్డినేటర్ కేవీ రమణ, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ పీఎం భాషా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరం పరిధిలోని 18 కేంద్రాలకు 6,330 మంది విద్యార్థులను కేటాయించగా, 6,019 మంది హాజరయ్యారు. 95.09 శాతం హాజరు నమోదైంది. పెందుర్తిలో 96.07 శాతం, గాజువాకలో 96.05 శాతం, మధురవాడలో 95.84 శాతం, తగరపువలసలో 95.78 శాతం మేర నమోదైంది. అత్యధికంగా భీమునిపట్నంలో 97.68 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఎండ తీవ్రత కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటలకు బదులు.. 9 గంటలకు పరీక్ష ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
జిల్లాలో 95.66 శాతం హాజరు


