చైన్నె పోర్టు సత్తా
విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ ఆల్ ఇండియా మేజర్ పోర్ట్స్ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్స్ 2025–26 శుక్రవారం ఘనంగా ముగిశాయి. నగరంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ముగింపు వేడుకలకు పోర్ట్ అథారిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ (ఐఈఎస్) ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులు క్రమశిక్షణ, నైపుణ్యం, క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించారని అభినందించారు. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పోర్ట్ అథారిటీలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాయి.
వెయిట్ లిఫ్టింగ్ ఫలితాలు
100 కేజీల విభాగంలో చైన్నె పోర్ట్ బంగారు పతకం, విశాఖ పోర్ట్ వెండి, కాంస్య పతకం సాధించాయి. 100 కేజీలకు పైబడిన విభాగంలో చైన్నె పోర్ట్, ముంబై పోర్ట్, విశాఖ పోర్ట్, 56 కేజీల విభాగంలో చైన్నె పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, దీన్దయాల్ పోర్ట్, 67.5 కేజీల విభాగంలో ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, చైన్నె పోర్ట్, 82.5 కేజీల విభాగంలో చైన్నె పోర్ట్, విశాఖ పోర్ట్ అథారిటీ, ముంబై పోర్ట్ వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు అధికారులు తెలిపారు.


