మురళీనగర్ : జిల్లాలో పాలిసెట్–2026 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 14,689 మంది పరీక్షలు రాయనున్నారు. ఈసారి గాజువాక, మధురవాడ, తగరపువలస ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని జిల్లా కోఆర్డినేటర్ కేవీ రమణ, అసిస్టెంట్ కోఆర్డినేటర్ పీఎం బాషా తెలిపారు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదన్నారు. అనివార్య కారణాల వల్ల ఎన్ఏడీలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రద్దు చేసి.. దీని స్థానంలో ఎన్ఏడీలోని నారాయణ ఈఎం హైస్కూలు, శ్రీచైతన్య ఈఎం స్కూల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.


