విశాఖ లీగల్ : రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు జిల్లా న్యాయమూర్తులకు బదిలీ కాగా పలువురు సీనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్ జనరల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సీఎన్ మూర్తికి బదిలీ అయింది. ఆయన స్థానంలో గుంటూరు అదనపు జిల్లా న్యాయమూర్తి చక్రపాణి నియమితులయ్యారు. సీఎన్ మూర్తి గుంటూరు ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్నారు. విశాఖలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి యు.యు.ప్రసాద్ బదిలీపై విజయవాడ వాణిజ్య న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్నారు. విజయవాడ 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డి.శేషయ్య విశాఖలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు. గాజువాక 12వ అదనపు జిల్లా జడ్జి జి.షణ్ముఖురావు విశాఖలోని నూతనంగా ఏర్పాటు చేసిన మూడో అదనపు కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గాజువాకలోని 13 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావు పదోన్నతిపై వస్తున్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా విజయవాడ వాణిజ్య కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు కుటుంబాన్ని న్యాయస్థానం న్యాయమూర్తిగా పదోన్నతిపై వస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన 15వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నగరంలోని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీహరి బదిలీ అయ్యారు. విశాఖలోని ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి జయ రాధారత్నం గుంటూరు బదిలీ కాగా, ఆమె స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎం.రాధాకృష్ణరాజు వస్తున్నారు. నగరంలోని ఆరో అదనపు జిల్లా కోర్టు కం మహిళా కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాసరావు బదిలీ కాగా ఆయన స్థానంలో పార్వతీపురం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.దామోదర్ రావు బదిలీపై వస్తున్నారు.


