ఆరిలోవ: ముడసర్లోవ వద్ద ఉన్న జీవీఎంసీ పాత స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని మరమ్మతులు చేసి, దాని ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని కమిషనర్ కేతన్గార్గ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఈ భవనాన్ని పరిశీలించారు. కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన భవనం నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరడంపై కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవన లోపల, బయట అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆవరణలో దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల తుప్పలను వెంటనే తొలగించాలని తూర్పు జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్కు సూచించారు. ఈ భవనాన్ని ఐటీ, పరిశ్రమలు లేదా కార్పొరేట్ సంస్థలకు అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించాలని అదనపు కమిషనర్ వర్మను ఆదేశించారు. పర్యవేక్షక ఇంజనీర్ శాంతిరాజ్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, రెవెన్యూ అధికారి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
మరమ్మతులు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశం


