ఏయూ వీఎస్ కృష్ణా లైబ్రరీ
మద్దిలపాలెం: అక్షర లక్షల పుస్తకాలకు నిలయం.. అరుదైన హస్త్రపతులకు ఆలయం ఏయూలోని డాక్టర్ వీఎస్.కృష్ణ గ్రంథాలయం. 1927లో ప్రారంభమైన ఈ లైబ్రరీ నేడు ఐదు లక్షలకు పైగా పుస్తకాలతో విజ్ఞాన గనిలా విరాజిల్లుతోంది. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవనానికి 1957లో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ గ్రంథాలయంలో ఉన్న అత్యంత అరుదైన సంపద ‘భారత రాజ్యాంగ అసలు ప్రతి’.. నాటి పార్లమెంట్ సభ్యులు స్వయంగా సంతకాలు చేసిన రాజ్యాంగ ప్రతి ఇక్కడ భద్రంగా ఉంది. వీటితో పాటు 2,663 అరుదైన తాళపత్రాలు, హస్త్రపతులు పరిశోధకులకు వరంగా మారాయి. ఇప్పటికే ఈ తాళపత్రాల డిజిటలైజేషన్ తొలి దశ పూర్తయ్యింది. ఒకేసారి 500 మంది కూర్చుని చదువుకునే సామర్థ్యం ఉన్న ఈ లైబ్రరీకి అనుబంధంగా ఇంజనీరింగ్, లా కళాశాల గ్రంథాలయాలు కూడా సేవలు అందిస్తున్నాయి.


