డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఆధీనంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వంటి క్రీడా వేదికల్లో యూజర్ చార్జీల వసూళ్లను తక్షణమే ఉపసంహరించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా శిక్షణ పొందే విద్యార్థులు, క్రీడాకారులపై యూజర్ చార్జీలు విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. క్రీడా మైదానాలు ప్రజల ఆస్తి కావాలని, వాటిని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం సరైంది కాదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు ఉచిత సేవలు అందించామని గుర్తుచేశారు. వెంటనే ఈ చార్జీలను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు అలపున కనకారెడ్డి, పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్రభరత్, స్టేట్ సాంస్కృతిక విభాగం కార్యదర్శి కె.సాగర్, 38వ వార్డు యూత్ ప్రెసిడెంట్ చేపల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


