బీచ్రోడ్డు: వాకర్స్, క్రీడాకారులపై యూజర్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ పార్కులు, స్టేడియాల్లో వాకింగ్ చేసే వారిపై సంవత్సరానికి రూ.720 వసూలు చేయడం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమన్నారు. వేల కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పించకుండా వ్యాపార ధోరణితో వ్యవహరించడం విచారకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.ఎన్.క్షేత్ర పాల్, ఎం.మన్మధరావు, ఆర్.శ్రీనివాసరావు, బి.నాగభూషణం, కె.వనజాక్షి, కె.అచ్యుతరావు, సిహెచ్.కాసుబాబు, పడాల గోవిందు, కాసుల్ రెడ్డి, జి.రాంబాబు, పి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.


