ఉన్నతాధికారులకు నివేదించాం:
కేజీహెచ్ సూపరింటెండెంట్
మహారాణిపేట: కేజీహెచ్లో ఆక్సిజన్ కొరత ఉందన్న మాట వాస్తవమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం లేదని, వాటికి మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులకు నివేదించామని ఆమె తెలిపారు. ఈ నెల 20న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘ఐసీయూలో ప్రాణవాయువు’కథనంపై మంగళవారం ఆమె వివరణ ఇచ్చారు. కంప్రెషర్ లోపాలు, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నాలుగు ప్లాంట్లు ప్రస్తుతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన రెండు పీఎస్ఏ యూనిట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా సూపర్ స్పెషాలిటీ బ్లాక్కు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2021–22 కాలంలో గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసేందుకు కేజీహెచ్ ఆవరణలో మొత్తం ఆరు యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు యూనిట్లను అప్పటి ముఖ్యమంత్రి నిధుల ద్వారా, మిగిలిన రెండు యూనిట్లను ప్రధాన మంత్రి నిధుల ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు.


