ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు ఆరిలోవ కాలనీ ఆఖరి బస్టాప్ సమీపాన సుమారు రూ. 2 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. కొండను ఆనుకొని ఉన్న ఈ జీవీఎంసీ స్థలంలో గుడి నిర్మాణం పేరుతో కొందరు ఆక్రమణదారులు ఆదివారం ఉదయం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా, ఆయనకు బదులుగా ఆయన తనయుడు ప్రతాప్రుద్ర హాజరై శంకుస్థాపన చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ స్థలంలో శనివారమే అనధికార నిర్మాణ పనులను సచివాలయ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, స్థానిక టీడీపీ నాయకుల అండతో ఆదివారం భూమిపూజ పూర్తి చేయడం గమనార్హం. ప్రజాప్రతినిధులే ఇలాంటి ఆక్రమణలకు వత్తాసు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతమవుతున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే వెలగపూడి తనయుడితో భూమిపూజ


