ఆరిలోవ: ఉపాధ్యాయుల్లో వృత్తి నిబద్ధతను పెంపొందించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాఘవ్ లాంగర్ సూచించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు పీఎంశ్రీ పాఠశాలలను సందర్శించారు. ఆ పాఠశాలల్లోని వొకేషనల్ ఎడ్యుకేషన్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, డిజిటల్ తరగతి గదులను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శుక్రవారం డీఈవో కార్యాలయంలో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధన పట్ల బాధ్యతాయుతమైన భావం కలిగి ఉండాలన్నారు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఆడియో–విజువల్ సాధనాలు, ప్లే–వే పద్ధతులను బోధనలో భాగం చేయాలని సూచించారు. విద్యార్థుల చేతిరాత మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆధునిక విద్యా విధానాలను అమలు చేసినప్పుడే పీఎంశ్రీ పాఠశాలలు ఆదర్శవంతమైన మోడల్ పాఠశాలలుగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ బి.విజయభాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఎస్ఎస్ఏ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జె. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎంసీ కార్యదర్శి రాఘవ్ లాంగర్


