సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి:
ఉత్సవాల కార్యక్రమాలు
● ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవాంగీకారం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
● 29న మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ధ్వజారోహణం, 6:30 నుంచి 7:30 వరకు ఎదురుసన్నాహోత్సవం, రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రథోత్సవం, రాత్రి 10.30 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు. రాత్రి 8.30 నుంచి 10.30 వరకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.
● 30న సాయంత్రం 5 గంటలకు శేషవాహనంపై స్వామివారి తిరువీధి.
● 31న మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు పండిత సభ, సాయంత్రం 6 గంటలకు సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి.
● ఏప్రిల్ 1న సాయంత్రం 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై తిరువీధి.
● ఏప్రిల్ 2న ఉదయం 6 గంటలకు పూర్ణాహుతి, 7 గంటలకు కొట్నాల ఉత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు. రాత్రి దొంగలదోపు ఉత్సవం.
● ఏప్రిల్ 3న ఉదయం 8 నుంచి 10.30 వరకు వినోదోత్సవం, 10.30 నుంచి 11.30 వరకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం.
దర్శనాల సమయాల్లో మార్పులు
● ఈనెల 28న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. ● 29 నుంచి ఏప్రిల్ 2 వరకు (మార్చి 29 మినహా) రాత్రి 7 గంటల తర్వాత దర్శనం ఉండదు. ● ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు.
సేవలు రద్దు: ఈనెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు సుప్రభాత సేవ, ఆరాధన సేవ టికెట్లు, 28 నుంచి ఏప్రిల్ 13 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఈనెల 29న కల్యాణోత్సవ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు రాజగోపురం సమీపంలోని కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు. కొండ దిగువ పుష్కరిణి సత్రం వద్ద ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు పౌరాణిక నాటకాలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు.


