కట్టెల పొయ్యిలపై వంటలు | - | Sakshi
Sakshi News home page

కట్టెల పొయ్యిలపై వంటలు

Mar 15 2026 1:30 AM | Updated on Mar 15 2026 1:30 AM

గ్యాస్‌పై పూర్తిగా ఆధారపడే కమర్షియల్‌ రంగంపైనా ఈ ప్రభావం పడుతోంది. కొన్ని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లకు కమర్షియల్‌ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు యజమానులు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. భారీ స్థాయిలో వంటలు చేసే క్యాటరింగ్‌ నిర్వాహకులు కూడా గ్యాస్‌ కోసం ఎదురుచూడకుండా కట్టెలు, బొగ్గు పొయ్యిలను సిద్ధం చేసుకుంటున్నారు. పనిభారం పెరిగినా ఆర్డర్లను పూర్తి చేయడానికి ఇదే మార్గమని చెబుతున్నారు.

కర్రలు కొనుగోలు చేస్తున్న చిరు వ్యాపారి

గ్యాస్‌ కొరత వస్తుందన్న ప్రచారంతో జిల్లాలో ఆందోళన

ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్న వినియోగదారులు

ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ పొయ్యిల కొనుగోళ్లలో జోరు

కమర్షియల్‌ సిలిండర్లు దొరక్క ఇబ్బందుల్లో రెస్టారెంట్లు

సాక్షి, విశాఖపట్నం: హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (హెచ్‌ఆర్‌ఏఏపీ), ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ (ఏఎస్‌హెచ్‌ఏ) ప్రతినిధులు సంయుక్తంగా హోటల్‌ యజమానులు, ప్రమోటర్లు, జనరల్‌ మేనేజర్లతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా పరిస్థితి, దాని ప్రభావం, వంటశాల నిర్వహణలో సమర్థవంతమైన విధానాలు, అవసరమైన చోట విద్యుత్‌ ఆధారిత వంట పరికరాల వినియోగం, మెనూలను సరళీకరించడం, ఎక్కువ సమయం తీసుకునే వంటకాలను తగ్గించడం వంటి అంశాలపై చర్చించారు. పరిస్థితి కొంతకాలం కొనసాగితే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉండే అవకాశముందని సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌ఏఏపీ అధ్యక్షుడు పవన్‌ కార్తీక్‌ మాట్లాడుతూ విశాఖలోని స్టార్‌ హోటల్స్‌కు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాలో పెద్ద అంతరాయం లేదని, హోటల్‌ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయన్నారు. అందువల్ల హోటళ్లు ముందస్తు జాగ్రత్తగా ఎల్‌పీజీ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించే చర్యలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ఏఎస్‌హెచ్‌ఏ ఉపాధ్యక్షుడు జి.వెంకటకృష్ణ, బీవీ నటరాజ్‌తోపాటు సభ్య హోటళ్ల యజమానులు, ప్రమోటర్లు, జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే అనుమానంతో ప్రజలు ఇప్పటికే ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ఎలక్ట్రానిక్‌ మార్కెట్లలో ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ పొయ్యిల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో నెలకు 400–500 వరకు అమ్ముడయ్యే ఇండక్షన్‌ స్టవ్‌లుం ఇప్పుడు ఒక్కరోజులోనే వందల సంఖ్యలో విక్రయమవుతున్నాయి. ‘గ్యాస్‌ లేకపోతే వంట ఎలా?’ అన్న ఆలోచనతో చాలామంది ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ పొయ్యిలను కొనుగోలు చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో దూర దేశాల్లో రగులుతున్న యుద్ధం..ం దాని ప్రభావం నగర వంటగదుల్లో కనిపిస్తోంది. వంటగ్యాస్‌ సరఫరా నిలిచిపోతుందన్న వదంతులు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ‘రేపు సిలిండర్‌ దొరకదేమో’ అన్న భయంతో వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. శనివారం ఉదయం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో చాలామంది సిలిండర్లు భుజాన వేసుకుని నేరుగా ఏజెన్సీలకు చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్‌ కార్యాలయాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపించింది. ఒక సిలిండర్‌ దొరికితే చాలు అన్నట్టుగా ప్రజలు పడుతున్న ఆత్రుత వంటగ్యాస్‌పై నెలకొన్న భయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

భరోసా ఉన్నా.. భయం తగ్గడం లేదు

జిల్లాలో గృహావసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధాన బాట్లింగ్‌ ప్లాంట్ల వద్ద ప్రస్తుతం 7 నుంచి 10 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. రోజుకు సగటున 25 వేల నుంచి 30 వేల వరకు సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయని తెలిపారు. డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ప్లాంట్లలో అదనపు షిఫ్టులు ఏర్పాటు చేసి బాట్లింగ్‌ ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థను కూడా పటిష్టం చేసి ‘ఫస్ట్‌ కమ్‌–ఫస్ట్‌ సర్వ్‌’ పద్ధతిలో సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు. అధికారుల భరోసా ఉన్నప్పటికీ ప్రజల్లో భయం మాత్రం తగ్గడం లేదు. వదంతులు వేగంగా వ్యాపించడం వల్ల ‘ముందే సిలిండర్‌ తెచ్చుకుందాం’ అనే ఆలోచనతో అనేక మంది ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు.

మహారాణిపేట: వంటగ్యాస్‌ సరఫరాపై ఏర్పడిన అనిశ్చితి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులపై కూడా ప్రభావం చూపుతోంది. రోగులకు భోజనం అందించే డైట్‌ క్యాంటీన్లలో గ్యాస్‌ సిలెండర్ల సరఫరా ఆలస్యమవుతున్నట్లు సమాచారం. కేజీహెచ్‌తో పాటు విక్టోరియా ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విమ్స్‌ ఆస్పత్రుల్లో ప్రతిరోజూ వేలాది మంది రోగులకు భోజనం తయారు చేయడానికి గ్యాస్‌ సిలిండర్లపై ఆధారపడుతున్నారు. కేజీహెచ్‌లో రోజుకు సుమారు 1,500–1,800 మంది రోగులకు భోజనం సిద్ధం చేయడానికి దాదాపు 12 సిలిండర్లు అవసరమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రిలో 5 సిలిండర్లు, టీబీ ఆస్పత్రి, ఆర్‌సీడీఈఎన్‌టీలో మూడు సిలిండర్లు, ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో మూడు సిలిండర్లు, విమ్స్‌లో 3 సిలిండర్లు, పీజీ హాస్టల్స్‌లో రెండు సిలిండర్లు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో గ్యాస్‌ సరఫరాపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రులకు అవసరమైన గ్యాస్‌ సిలిండర్లను నిరంతరంగా సరఫరా చేయాలని గ్యాస్‌ ఏజెన్సీలను ఆదేశించారు.

ఎలక్ట్రికల్‌ స్టవ్‌ను కొనుగోలు చేస్తున్న మహిళ

గ్యాస్‌ కష్టాలపై ‘స్టార్‌’ హోటళ్ల భేటీ

ఆస్పత్రులకు గ్యాస్‌ సెగ

జిల్లా పరిషత్‌ వద్ద కర్రల పొయ్యిపై వండుతున్న వీధి వ్యాపారి

గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో క్యూ కట్టిన జనం. సీతంపేట,గురుద్వార తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

గ్యాస్‌ సిలిండర్‌ విడిపించుకొని వెళ్తున్న మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement