
● జీఐఎస్–2023లో పదుల సంఖ్యలో పర్యాటక ఒప్పందాలు ● జిల్
సాక్షి, విశాఖపట్నం : టూరిజం కేంద్రంగా విశాఖ.. గత ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనేక ప్రయత్నాలు జరిగాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా, విశాఖను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేందుకు భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా, జీఐఎస్–2023లో విదేశీ సంస్థలకు రాయితీలు ఇస్తూ, పీపీపీ (ప్రైవేట్–పబ్లిక్ పార్టనర్షిప్) విధానంలో రూ. 8,806 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. అయితే ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సమయంలో ప్రభుత్వం మారడంతో, కూటమి ప్రభుత్వం ఈ పర్యాటక ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. గతంలో కుదిరిన ఒప్పందాలపై కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించలేదు. ఎంవోయూలు చేసుకున్న సంస్థలు భూమి కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని అడుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. దీనికి తోడు, కొత్తగా ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా టూరిజం అధికారులు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రూ.కోట్లు విలువ చేసే స్థలాలపై
కూటమి కన్ను
గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కన పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ప్రాజెక్టులను విస్మరించి, తమ అనుచరులకు పర్యాటక ప్రాజెక్టుల పేరుతో భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని పర్యాటక భూముల్లో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి జిల్లా పర్యాటక శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కూటమి నాయకుల ఆదేశాల ప్రకారం, వారే చెప్పిన వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.