
నేడు స్టాండింగ్ కమిటీ ఎన్నిక
● 10 మందిని ఎన్నుకోనున్న కార్పొరేటర్లు ● బరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ
డాబాగార్డెన్స్: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. కౌన్సిల్ హాల్లో ఉదయం 10 గంటలకు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో స్టాండింగ్ కమిటీలోని 10 స్థానాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది, తెలుగుదేశం పార్టీ నుంచి పది మంది కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ఇదిలావుండగా జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలో సీపీఎం పాల్గొనడం లేదని సీపీఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు పేర్కొన్నారు. అలాగే 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా ఓటింగ్లో పాల్గోవడం లేదని స్పష్టం చేశారు.
ఓటింగ్ ప్రక్రియ ఇలా..
స్థాయీ సంఘం ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే జరుగుతాయి, కానీ ప్రాధాన్యత ఓట్లు ఉండవు. ఒక్కో కార్పొరేటర్కు 10 ఓట్లు ఉంటాయి. కార్పొరేటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మొత్తం 95 ఓట్లు పోలవుతాయి. ఒకే బ్యాలెట్ పేపర్పై వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన 20 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి.కార్పొరేటర్లు తమకు నచ్చిన 10 మంది అభ్యర్థుల పేర్ల ముందు టిక్ చేసి ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి ఒక ఓటు చొప్పున గరిష్టంగా 10 మందికి 10 ఓట్లు వేయవచ్చు. ఎవరైనా 11 ఓట్లు వేస్తే ఆ ఓటు చెల్లనిదిగా పరిగణిస్తారు. ఒక అభ్యర్థికి 48 ఓట్లు వస్తే విజేతగా ప్రకటిస్తారు.
పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు
నిక్కల లక్ష్మి (20వ వార్డు), సాడి పద్మారెడ్డి (24వ వార్డు),పల్లా అప్పలకొండ (28వ వార్డు),బిపిన్ కుమార్ జైన్ (31వ వార్డు), గుండపు నాగేశ్వరరావు (40వ వార్డు), కోడిగుడ్ల పూర్ణిమ (41వ వార్డు), రెయ్యి వెంకటరమణ (51వ వార్డు), కేవీఎన్ శశికళ (55వ వార్డు), మహ్మద్ ఇమ్రాన్ (66వ వార్డు), ఉరుకూటి రామచంద్రరావు (70వ వార్డు)
టీడీపీ నుంచి..
మొల్లి హేమలత (5వ వార్డు), సేనాపతి వసంత (96వ వార్డు), రాపర్తి త్రివేణి వరప్రసాదరావు (92వ వార్డు),దాడి వెంకట రామేశ్వ రరావు (88వ వార్డు), రౌతు శ్రీనివాస్ (78వ వార్డు), మొల్లి ముత్యాలు (87వ వార్డు), మాదంశెట్టి చిన్నతల్లి (83వ వార్డు), కొణతాల నీలిమ (79వ వార్డు), గేదెల లావణ్య (17వ వార్డు), గంకల కవిత (47వ వార్డు)