నమ్మివానిపేటలో హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

నమ్మివానిపేటలో హైడ్రామా

May 6 2025 1:06 AM | Updated on May 6 2025 1:06 AM

నమ్మివానిపేటలో హైడ్రామా

నమ్మివానిపేటలో హైడ్రామా

ఆత్మహత్య చేసుకుంటానని దత్తిరాజేరు వాసి హల్‌చల్‌

తగరపువలస: జీవీఎంసీ రెండో వార్డు నమ్మివానిపేటలో ఓ ఇంటి మేడపైకి సోమవారం ఉదయం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాదకు చెందిన ఆవాల ఎర్రయ్య ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఆ ఇంటిని ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభంనకు వేలాడుతున్న వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానికులు, ఎర్రయ్య భార్య నరసయ్యమ్మ తెలిపిన వివరాలివి. ఎర్రయ్య ఫూల్‌బాగ్‌ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల అతని కుమారుడు మణికంఠకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సంగివలస అనిల్‌ నీరుకొండ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేర్పించారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ బాధపడుతున్న మణికంఠకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే కుమారుని ఆరోగ్యం బాగాలేదన్న మనస్థాపంతో ఆసుపత్రి ఆరో అంతస్తు నుంచి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఎర్రయ్య కిందకు దిగాడు. పక్కనే ఉన్న నమ్మివానిపేట గ్రామానికి చేరుకుని ఓ ఇంటి మేడపైకి చేరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పటికే స్థానికులు మేల్కొని ఉండటంతో.. గ్రామస్తులందరికీ సమాచారమిచ్చారు. కుమారుడి ఆరోగ్యం బాగా లేదని, ఎవరో తనను చంపడానికి వస్తున్నట్టు రకరకాలుగా స్థానికులకు చెప్పాడు. దీంతో వారు ఎర్రయ్యకు నచ్చజెప్పి ఉదయం 6.15 గంటల సమయంలో కిందకు దించారు. తర్వాత ఆసుపత్రిలో ఉన్న భార్యకు సమాచారం అందించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న భీమిలి పోలీసులు ఎర్రయ్యకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement