
జూన్ 9న వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన
విశాఖ విద్య: జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్ని నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాలులో గురువారం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఇటీవల 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని, అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నట్లు వెల్లడించారు. వీటిని తక్షణమే పునరుద్ధరించాలనే డిమాండ్తో జూన్ 9న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాల ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనా లని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. అలాగే జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సైతం నోచుకోలేదన్నారు. పెన్షన్ పథకం అమలు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా పునరుద్ధరించాలని తీర్మానించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో భాగంగా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్కు సంబంధించిన నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్ఏజే సెక్రటరీ జనరల్ ఎం.కొండయ్య, జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కె.మంజరి, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె.మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, కె.శ్రీనివాస్ రావు, పలు జిల్లాల ఫెడరేషన్ నేతలు పాల్గొన్నారు.
నూతన వెబ్సైట్ను ఆవిష్కరిస్తున్న నాయకులు