
పీతల మూర్తి యాదవ్పై చర్యలకు డిమాండ్
బీచ్రోడ్డు: పిఠాపురం కాలనీలోని వాంబే గృహ గోడ కూల్చడంపై రజకుల సేవా సంఘం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నిరసన చేపట్టారు. గోడ కూల్చివేతకు సంబంధించి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పంపించాడని ఆరోపిస్తూ.. జనసేన పార్టీ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై మూర్తి యాదవ్ దౌర్జన్యం చేస్తున్నాడని మండిపడ్డారు. పిఠాపురంకాలనీలో ప్రభుత్వం ఇచ్చిన వాంబే గృహాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామన్నారు. పీతల మూర్తిని స్థానికులు పట్టించుకోకపోవడంతో వార్డు ప్రజలపై దౌర్జన్యం మొదలుపెట్టాడని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ప్రహరీని విరగొట్టించాడని దుమ్మెత్తి పోశారు. అతని దగ్గర నాలుగేళ్లుగా లంచం తీసుకుని పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సెక్రటరీ జ్యోతిని పంపి.. ఈ పని పూర్తి చేయించాడని ఆరోపించారు. వార్డు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పీతల మూర్తిపై పవన్ కల్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అతని నుంచి 22వ వార్డు ప్రజలను కాపాడాలని కోరారు.