
హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని మృతికి సంతాపం
మహారాణిపేట/డాబాగార్డెన్స్ : తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, విశాఖ వాసి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (54) హైదరాబాద్లో ఆకస్మిక మృతి పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన జస్టిస్ ప్రియదర్శిని ఎంబీఎం లా కళాశాల నుంచి 1995లో న్యాయపట్టా అందుకున్నారు. 1995లోనే విశాఖ బార్ అసోసియేషన్లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాదులు ఉమాబాలాజీ, ఎన్.బద్రీనాథ్ దగ్గర న్యాయవాదిగా శిక్షణ పొందారు. 2008లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఇందిరా ప్రియదర్శిని సహచరులు లక్ష్మీ రాంబాబు, మంజులత, అరుణ కుమారి హేమలత తదితరులు తమ సంతాప సందేశాన్ని తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీఏకే చాంబర్స్లో ఆదివారం నిర్వహించిన సంతాప సభలో ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైపా అరుణ్కుమార్ ఆమె చిత్రపటాని కి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయవాదులు వాగుపల్లి చిన్నారావు, డాక్టర్ టి.బోసుబాబు, పాకా సత్యనారాయణ, లాయర్స్ ఫోరమ్ ఫర్ జస్టిస్ గుడిపల్లి సుబ్బారావు, నిమ్మకాయల ఈశ్వరరావు, సి.రవి, పడమట సురేష్, కోమల కిరణ్ పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని మృతికి సంతాపం