
అమోఘం రిషిక నాట్యం
అంతరంగ
ఉత్సవ్–2025లో ప్రథమ స్థానం
5వ తరగతి నుంచే అవార్డులు
తల్లి ప్రోత్సాహంతో రిషిక ఎన్నో నృత్య పోటీలలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 5వ తరగతిలో ప్రతిష్ఠాత్మకమైన ‘రూట్స్ టు రూట్స్ ఎక్స్ంప్లరి’ అవార్డును అందుకుంది. 6వ తరగతిలో రీజినల్ స్థాయికి చేరుకుని తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అదే స్ఫూర్తితో గత సంవత్సరం రీజినల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 2 వేల మంది పోటీదారులను అధిగమించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.
తాటిచెట్లపాలెం:
నగరానికి చెందిన జి. రిషిక తన అకుంఠిత దీక్షతో, అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా విశాఖ కీర్తిని చాటిచెబుతోంది. ఇటీవల ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ లతా మంగేష్కర్ నాట్యగృహ ఆడిటోరియంలో జరిగిన అంతరంగ ఉత్సవ్–2025లో కూచిపూడి నృత్య ప్రదర్శనతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది మాత్రమే కాదు, 2023–24 సంవత్సరంలో న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా నిర్వహించిన కళా ఉత్సవ్లోనూ రిషిక తన కూచిపూడి నాట్యంతో క్లాసికల్ డ్యాన్స్ బాలికల విభాగంలో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించింది. తద్వారా కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు సైతం దేశ రాజధానిలో విశేషమైన గుర్తింపు లభించింది. రిషికలోని అసాధారణ ప్రతిభను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించడం విశేషం. గత ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవం, అలాగే విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పె చర్చా’ కార్యక్రమానికి ఆమెను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఇటీవల ముంబయిలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన రిషికను కేవీ స్కూల్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
సాధారణ కుటుంబం.. అసాధారణ ప్రతిభ
రిషిక తండ్రి ఒక ప్రైవేటు కళాశాలలో గుమస్తాగా పనిచేస్తుండగా, తల్లి బి.రామలక్ష్మి మల్లునాయుడుపాలెంలోని జెడ్పీ హైస్కూల్లో ఆర్ట్/క్రాఫ్ట్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. రిషిక చెల్లి ప్రస్తుతం కేవీ వాల్తేర్లో 9వ తరగతి చదువుతోంది. వీరి కుటుంబంలో సంగీతం, నాట్యం వంటి కళలకు సంబంధించి ఎలాంటి నేపథ్యం లేకపోయినా, చిన్ననాటి నుంచే రిషికకు నృత్యంపై ఉన్న అమితమైన ఆసక్తిని తల్లి గుర్తించారు. సినిమా పాటలకు అనుగుణంగా రిషిక చేసే నాట్యాన్ని చూసి మురిసిపోయేది. తల్లి ప్రోత్సాహంతో రిషిక క్లాసికల్ డ్యాన్స్లో చేరింది.
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రత్యేక ఆహ్వానం
రిషిక ప్రతిభకు ముగ్ధులైన న్యూ ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించింది. ఎన్సీఈఆర్టీ కళాఉత్సవ్ 2023–24 విజేతలకు ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వారు రాణిస్తున్న కళారూపాల్లో మరిన్ని మెళకువలు నేర్పించి, వారి ప్రతిభను మరింతగా మెరుగుపరచడమే ఈ ప్రతిభా సంవర్ధన్ – 2025 కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు రిషిక మరోసారి ఢిల్లీకి వెళ్లనుంది. రిషిక సాధించిన విజయాలు కేవలం ఆమె కుటుంబానికే కాకుండా, విశాఖ నగరానికి, కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు గర్వకారణం. చిన్న వయస్సులోనే ఆమె కనబరుస్తున్న అకుంఠిత దీక్ష, అద్భుతమైన నృత్య ప్రతిభ ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, విశాఖ కీర్తిని వినువీధిన ఎగురవేయాలని ఆశిద్దాం.

అమోఘం రిషిక నాట్యం

అమోఘం రిషిక నాట్యం

అమోఘం రిషిక నాట్యం

అమోఘం రిషిక నాట్యం

అమోఘం రిషిక నాట్యం