
బాల్యం విద్యా కేంద్రాల పటిష్టతకు చర్యలు
డాబాగార్డెన్స్: ప్రాథమిక విద్యకు జీవీఎంసీ బాల్యం పాఠశాలలు పునాది కావాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో బాల్యం విద్యా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బాల్యం విద్యా కేంద్రాల పటిష్టత, నమోదు శాతాన్ని పెంచేలా, ఈ వేసవి సెలవుల్లో ప్రణాళికలు చేపట్టాలన్నారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఉత్తమ పూర్వ ప్రాథమిక విద్యనందించేలా బాల్యం కేంద్రాలు పని చేయాలన్నారు. అనంతరం బాల్యం విద్యా కేంద్రాల్లో నమోదు శాతం పెంచేందుకు, అక్కడ అందించే విద్య, ఇతర సౌకర్యాల వివరాలతో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ వర్మ, బాల్యం విద్యా పథకం ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మోహన్కుమార్ ఆవులపాటి తదితరులు పాల్గొన్నారు.