
సింహాచలం ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే..
● కుటుంబాలకు రూ.కోటి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ● మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్
డాబాగార్డెన్స్/ఆరిలోవ: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారంతో పాటు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులను విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ నాయకులు కొండా రాజీవ్గాంధీ, పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ్, రవిరెడ్డి, జియ్యాని శ్రీధర్, పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమో.. సింహాచలానికి చందనోత్సవం అంత పవిత్రమని చెప్పారు. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని తెలిసీ కూడా అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కొండవాలులో ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన రక్షణ గోడను ఫ్లైయాస్ ఇటుకలతో నిర్మించడమే గాక పెండాల్స్ను గోడకు కట్టడం.. ఫలితంగా ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యం.. చేతగానితనం తేటతెల్లమైందన్నారు. భక్తులకు చేసిన ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాల రోదన అంతా ఇంతా కాదన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.కోటి పరిహారం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇది ‘కూటమి’ వైఫల్యమే..
చందనోత్సవంలో ఇంతటి ఘోరం జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుత ఘటన నిస్సందేహంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.