మధురవాడ: ఓ ఫంక్షన్ హాలు లిఫ్ట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలివి.. పీఎంపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డులోని డీవీఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 3వ అంతస్తు నుంచి కిందకు దిగేందుకు 8 మంది ఎక్కారు. ఈ క్రమంలో లిఫ్ట్ అదుపు తప్పింది. రెండో అంతస్తులో ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా నేరుగా కింది ఫ్లోర్కు పెద్ద శబ్దంతో వచ్చి పడిపోయింది. ఈ ప్రమాదంలో మర్రిపాలెం సాయినగర్కి చెందిన వైశ్యరాజు సౌందర్య, ఆమె చెల్లి చంద్రకుమారి మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని ఎన్ఆర్ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
ఎంవీవీ సిటీలో..
పీఎంపాలెం క్రికెట్ స్టేడియంనకు ఎదురుగా ఉన్న ఎంవీవీ సిటీలో 10వ అంతస్తు నుంచి కిందకు దిగేందుకు పి.రోజామణి లిఫ్ట్ ఎక్కింది. ఆ లిఫ్ట్ 6వ ఫ్లోర్కు వచ్చి పెద్ద శబ్దంతో కుదుపుతో ఆగిపోయింది. ఈ ఘటనలో ఆమె కాలుకు గాయాలయ్యాయి. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి బుధవారం ఆమె పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.