తాండూరు రూరల్: గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన తాండూరు మండలం చంద్రవంచ గేటు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం...కరన్కోట్ గ్రామానికి చెందిన రషీద్ నాపరాతి కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రవంచ గేటు సమీపంలోని ఓ హోటల్ వద్ద రషీద్కు గుండె నొప్పి రావడంతో కింద పడిపోయాడు. అదే గ్రామానికి చెందిన శ్రీహరి గమనించి వెంటనే సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం రషీద్ను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు.
పూరి పీఠాధిపతి దుర్గానందస్వామి
కొత్తూరు: సనాతన ధర్మం ఒక మతం మాత్రమే కాదని ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు దిక్సూచిలా దిశానిర్దేశం చేస్తుందని పూరి పీఠాధిపతి దుర్గానందస్వామి అన్నారు. మండలంలోని సిద్ధాపూర్లో ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత ఎల్లారం శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందువులందరినీ ఏకతాటి పైకి తీసుకురావడంతో పాటు సమాజ శ్రేయస్సు, వారిలో దేశభక్తి నింపడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన పూర్వీకుల నుంచి మనం ఆచరిస్తున్న సనాతన, హిందూ ధర్మాలు, ఆచారాలను భావితరాలకు అందించడం మన బాధ్యత అని వివరించారు. కులాల మధ్యన వైషమ్యాలను వీడి హిందువులందతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందూ సంఘం ప్రతినిధి పెండం శోభ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచారాలు, వారిపైన జరుగుతున్న దాడులను ఖండించారు.


