ధారూరు/మోమిన్పేట: ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు నెలాఖరులోగా చెల్లించాలి జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టార్ భవానీ విక్రమ్ అన్నారు. లేకుంటే కొత్త రుణాలు వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస వడ్డీతో బంగారంపై రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కావాల్సిన రైతులు సొసైటీ సీఈఓ నర్సింహులును సంప్రదించాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్లో డ్రోన్ కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయరాదన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, హెచ్డీసీసీబీ సూపర్ వైజర్ విజయేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్పీఓ సభ్యత్వంతో ప్రయోజనం
మోమిన్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ప్రతి సభ్యుడూ ఎఫ్పీఓ(ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకోవాలని మోమిన్పేట పీఏసీఎస్ ప్రత్యేకాధికారి మాధవి తెలిపారు. శనివారం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎఫ్పీఓలో రూ.2 వేల రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ.2 వేలు జమ చేస్తుందని తెలిపారు. ఈ మొత్తంతో పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రోన్లు వంటి యంత్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. వాటిని అద్దెకు తీసుకెళ్ల వచ్చని చెప్పారు. సహకార సంఘం నుంచి ఇప్పటికే కామన్ సర్వీస్ సెంటర్ నడిపిస్తున్నట్లు చెప్పారు. త్వరలో డ్రోన్ కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి ఉంచుతామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల విక్రయం ద్వారా రూ.5,67,533 లాభం ఆర్జించినట్లు తెలిపారు. రైతులకు రూ.19.35కోట్ల దీర్ఘకాలిక రుణాలు, బంగారంపై రూ.34 లక్షలు, స్వల్ప కాలిక రుణాలు రూ.18.12 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటి 35 శాతం దీర్ఘకాలిక రుణాలను రికవరీ చేశామన్నారు. ప్రతి సభ్యుడు సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఈఓ శేఖర్, మాజీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్రిజిస్ట్రార్ భవానీ విక్రమ్


