ఉన్న వనరులనుసద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ దీపక్ తివారి
ముగిసిన సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం
అనంతగిరి: ఆదర్శ గ్రామ పంచాయతీలే లక్ష్యంగా పాలన సాగాలని కలెక్టర్ దీపక్ తివారి సర్పంచ్లకు సూచించారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లిలో సర్పంచుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. జీపీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత మీపై ఉందన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పంచాయతీల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఇంటి, దుకాణాల పన్నులతో పాటు ఇతర ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు, నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు, సామాజిక రుగ్మతలు, రోడ్ల ప్రమాదాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చర్యలు చేపట్టాన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామంలో సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతుబంధు, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలను చర్చించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీపీఓ జయసుధ, మాస్టర్ ట్రైనీలు(ఎంపీడీవోలు) వినయ్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డ్యూటీ రిజిస్టర్, ప్రశ్న పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, మెడికల్ సిబ్బంది గురించి ఆరా తీశారు. మందులను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఈఓ రేణుకాదేవి, చీఫ్ సూపరింటెండెంట్ రాజు తదితరులు ఉన్నారు.
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి


