దోమ: సంజీవ స్వామి వారి ఆలయ భూములను కాపాడి గుడి పునఃనిర్మాణానికి చర్యలు తీసుకోవాలని దొంగఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అశోక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి 104.16 ఎకరాల భూములు ఉన్నాయని, వాటిని కొంత మంది రాజకీయ నేతలు, రియల్టర్లు కబ్జాలకు పాల్పడి విక్రయానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. పరిగి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383లో 9.18 ఎకరాలులు, పూడూర్ మండలంలోని సర్వే నంబర్ 311, 312లో 4.26 ఎకరాల భూములు ఉన్నాయని, ఆ భూములను పట్టాలుగా మార్చి ఇతర పేర్లపైకి చేసుకున్నారన్నారు. వెంటనే ఆ భూములను త్వరితగతిన ఆలయ పేరిట మార్చాలన్నారు. ఆ భూములను వ్యాపార కార్యక్రమాలకు లీజుకు ఇస్తే ఆలయానికి రూ.కోట్లల్లో ఆదాయం వస్తుందన్నారు. సమకూరిన ఆదాయంతో ఆలయాన్ని సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు శేరిరాంరెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, కృష్ణారెడ్డి, హన్మంత్, యాదయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
దొంగఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి


