బంట్వారం: మండల కేంద్రం కోట్పల్లిలో నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారింది. సుమారు 40 ఏళ్ల కిందట నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్.. ప్రస్తుతం వినియోగంలో ఉన్నప్పటికీ.. అధికంగా నీరు లీకవుతోంది. దీంతో పూర్తిగా నాచుపట్టింది. అక్కడక్కడా పెచ్చులు ఊడి, ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారి పక్కన, ఇళ్ల మధ్య ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న ట్యాంకును ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, పిల్లలు అక్కడే ఆడుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రాణాపాయం తప్పదని వాపోతున్నారు. ఇదే విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి, ట్యాంకును కూల్చివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్


