పరిగి డీఎస్పీ శ్రీనివాస్
పరిగి: శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే వెంటనే ట్రేస్ చేయవచ్చని చెప్పారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హన్మయ్య, ఉపసర్పంచ్ రాధమల్లేశ్, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మా వార్డుల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టండి
తాండూరు టౌన్: పట్టణంలో బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలి కౌన్సిల్ సమావేశం సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నాగారం మల్లేశం, అంతారం కిరణ్ ముదిరాజ్, డి.శ్రీ కాంత్ రెడ్డి ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా తమ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు.
రోడ్డు అభివృద్ధి పనులు షురూ
అనుమతులు లేవని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
బషీరాబాద్: నీళ్లపల్లి ఏకాంబరి ఆలయానికి వెళ్లే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టర్ రూ.95 లక్షలతో మెయిన్ రోడ్డు నుంచి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా సీసీ బెడ్ వేయనున్నారు. ఇదిలా ఉండగా మెయిన్ గేటు ప్రధాన ద్వారం వద్ద అటవీ శాఖ అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారని ఆశాఖ అధికారులు మంగళవారం రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు.
‘పది’ పరీక్షలకు 568 మంది
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలంలో పదో తరగతి పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్(బాలికల) పరీక్ష కేంద్రంలో 188 మంది విద్యార్థులు, పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్ (బాలుర)–200 మంది, మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్–180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
హిందూ సంప్రదాయంతో ప్రపంచానికి వెలుగు
జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్
కుల్కచర్ల: ప్రపంచానికి వెలుగుచూపేది హిందూ సాంప్రదాయమేనని తెలంగాణ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మఠం రాజశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నదుల మఠం శశిభూషణ సిద్ధాంతి రచించిన పరాభవ సంవత్సర భారతి పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నింటికీ మూ లం హిందూ మతంలోని ఆచార సాంప్రదాయాలేనని అన్నారు. జంగమ అర్చకులకు ఉచితంగా పంచాంగం పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్, విశ్వం, అనిల్, శివకుమార్, నాగరాజు, వీరేశం పాల్గొన్నారు.


