● తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
● తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలు
● ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ధర్మకర్తలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి బాలాలయంలో నిర్వహించనున్నారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆస్థాన సేవలుగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ.110 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాలను తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వాహన సేవలు, నిత్య పూజలు, సుప్రభాత, తోమాల సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శేష వస్త్రాలు సమర్పిస్తారు.
నిత్య కార్యక్రమ వివరాలు
16వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనం, 17వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనం, 18న సింహ వాహనం, వ్యాళి వాహనం, 19న కల్ప వక్ష వాహనం, ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం, 20న పల్లకీలో మోహినీ అవతార ఉత్సవం, టీటీడీ శేష వస్త్రాల సమర్పణ, రాత్రికి గరుడ వాహనం, 21న హనుమంత వాహనం, గజవాహనం, 22న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 23న రథోత్సవం, అశ్వవాహనం, 24న రోహిణీ ఆస్థానం ఉంటుంది. రోజూ సాయంత్రం 7గంటలకు బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమం ఉంటుందని ధర్మకర్తలు తెలిపారు.


