రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు సిల్వర్ మెడల్స్
బొంరాస్పేట: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో బాపల్లితండాకు చెందిన యువకుడు ఎం.దినేశ్ సత్తాచాటాడు. ఈ నెల 3 నుంచి 6వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించిన సీఎంకప్ రాష్ట్రా స్థాయి పారా పోటీల్లో వంద మీట ర్ల పరుగుపందెం, జావలిన్త్రో, క్రికెట్లో రన్నరప్టీంలో సభ్యుడిగా ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడు వెండి పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆదివారం సర్పంచ్ కోమల్, నాయకులు తారాసింగ్, రతన్నాయక్, చందర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
తాండూరు టౌన్: భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎస్ఎఫ్ఐ తాండూరు డివిజన్ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్లో మీరు సాధించాల్సిన ఉన్నత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికారాదని, ఇన్ని రోజులు చదివిన ప్రశ్న జవాబులను ఏకాగ్రతతో రివిజన్ చేసుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎస్ఎఫ్ఐ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకాశ్, రాజు పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
నాంపల్లి: మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని హరియాణ రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఆదివారం పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తెలుగు వర్సిటీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... సమాజంలో మహిళల పాత్ర విస్మరించలేనిదని అన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విశిష్ట అతిథి ఈస్ట్ ఇండియా అగరపుడ్ కంపెనీ చైర్మన్ యామినేని ఉప్పల్ రావు మాట్లాడుతూ... ప్రతి మహిళా ఆర్థిక స్వాతంత్య్రురాలు కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన 25 మంది మహిళలకు విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో లుక్ అప్ ట్రెంజ్ డైరెక్టర్ కాంతిరేఖ, పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ చైర్మ న్ అద్దంకి రాజా యోనా, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు బాల్సన్ నాయక్ పాల్గొన్నారు.
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కడ్తాల్– అన్మాస్పల్లి రహదారిపై చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలివీ.. మండలంలోని గానుగుమార్లతండాకు చెందిన ఇస్లావత్ ఘాంస్య(47) ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై తండా నుంచి కడ్తాల్ వస్తున్నాడు. అదే సమయంలో కడ్తాల్ నుంచి అన్మాస్పల్లి వెళ్తున్న ఓమ్నీ కారు పోచమ్మ గడ్డతండా వద్ద ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఘాంస్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


