దుద్యాల్: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల విద్యుత్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు అహరించారు. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త ఎల్లప్ప, రెబ్బని యాదయ్య, కొత్త వెంకట్రాములు, బోయిని అంజిలయ్యలు బోరు బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రైతులకు చెందిన మోటార్ల కరెంట్ వైరు సుమారు 100 మీటర్లు చోరీకి గురైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సౌకర్యాల కల్పనపై
శ్రద్ధ చూపాలి
దోమ: విద్యార్థుల చదువుతో పాటు సౌకర్యాల కల్పనపై అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీసీడీఓ శ్రీదేవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేకాధికారి శైలజతో కలసి పరిసరాలు, స్టోర్రూమ్, వంట గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించేలా చూడాలన్నారు.
వైద్యసేవలు అభినందనీయం
కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజిలయ్య అన్నారు. శనివారం గ్రామంలో ‘ఔషధి హోమియోపతి క్లినిక్’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు.. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు సాయికీర్తి, ఉప సర్పంచ్ శాస్త్రి, మాజీ వైస్ ఎంపీపీ రాజశేఖర్, నాయకులు హరినాథ్ రెడ్డి, గోపాల్, పాష తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్లకు సన్మానం
తాండూరు: బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లను శనివారం ఆ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింహులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 9న జరిగే కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, గద్దే శ్రీనివాసచారి, నరేందర్గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


