పూలతోట రామదాసుకు పూజలు
బషీరాబాద్: మండల పరిధిలోని జీవన్గీ గ్రామం బర్కాల్ పూలతోట రామదాసు మఠంలో భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. నవల్గా నుంచి ప్రారంభమైన స్వామివారి పల్లకీసేవ పాదయాత్రగా శుక్రవారం రాత్రి జీవన్గీ చేరుకుంది. పూలతోట రామదాసు ఆలయంలో పంచాక్షరి, అష్టాక్షరితో అఖండ శివనామస్మరణ చేశారు. ఓం నమో శివాయ, ఓం నమో నారాయణ అంటూ జపంతో 24 గంటల పాటు భక్తులు భక్తిశ్రద్ధలతో ముక్త నామస్మరణ పఠించారు. మఠం చైర్మన్ దాసరి కృష్ణ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజాము వరకు ఘనంగా భజనలు, ప్రత్యేక పూజలు సాగాయి. అనంతరం రామదాసు విగ్రహానికి, శివ లింగానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పల్లకీ సేవ కొనసాగింది. ప్రతీ శివరాత్రికి నవల్గా నుంచి మొదలయ్యే పల్లకీ సేవా జీవన్గీ, కరన్కోట గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కర్ణాటకలోని మిర్యాణ్ రామదాసు సమాధి వరకు పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామదాసు భజనమండలి సభ్యులు అడ్వకేట్ నవల్గా విశ్వనాథం, సర్పంచ్ రామని బసప్ప, ఉప సర్పంచ్ జర్నప్ప, శాంతిగిరయ్య, వీరారెడ్డి, పల్లె నరేందర్రెడ్డి, ఏదుల మల్రెడ్డి, జగదీశ్వర్ స్వామి, కుక్కింద వెంకట్రామ్రెడ్డి, వాకారం వెంకట్రామ్రెడ్డి, అనంత్రెడ్డి, సోమశేఖరరెడ్డి, ఎనుముల అంజిలప్ప, పోతురాజు భీమప్ప, కుర్మ వీరప్ప, భీంరెడ్డి, భక్తులు భారీగా పాల్గొన్నారు.
నవల్గా నుంచి కరణ్కోట వరకు
పల్లకీసేవతో పాదయాత్ర
పంచాక్షరి, అష్టాక్షరితో
అఖండ శివనామస్మరణ
భారీగా హాజరైన భక్తజనం
పూలతోట రామదాసుకు పూజలు


