
ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడికి సన్మానం
బొంరాస్పేట: జాతీయ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింలుగౌడ్ను పలువురు నాయకులు, ఆయా సంఘాల సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో కోస్గి ఏఎంసీ మాజీ చైర్మన్ ఏర్పుమళ్ల వెంకట్రాములుగౌడ్, రాంచంద్రారెడ్డి, గౌడసంఘం మండల నాయకులు ప్రకాశ్గౌడ్, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులున్నారు.
భవిత సెంటర్లో ఫిజియోథెరపీ
ఎంఈఓ చంద్రప్ప
బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఫిజి యోథెరపీకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు తప్పక తీసుకురావాలని కోట్పల్లి ఎంఈఓ చంద్రప్ప అన్నారు. సోమవారం భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు డాక్టర్ శ్రీకాంత్ ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. సుమారు 20 మందికి పైగా పిల్లలకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. వీరికి ప్రతిరోజు తరగతులు ఉంటాయన్నారు. వారానికోసారి ఫిజియోథెరపీ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్, ఐఈఆర్పీ దిలీప్కుమార్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు.
వైద్య శిబిరానికి స్పందన
380 మందికి ఉచిత పరీక్షలు
తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 380 మంది పేషంట్లు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓ లలితాదేవి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ఈ శిబిరం విజయవంతమైంది అన్నారు. 62 మందికి ఆపరేషన్ల నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. వీరికి వారం రోజుల్లో ఆపరేషన్లు పూర్తి చేస్తామన్నారు. అనంతరం పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు గిరిధర్, అక్షయ్, అఖీల్ ఖాన్, రాధ, రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
భర్తపై కేసు
మొయినాబాద్: అదనపు కట్నం కోసం భార్య ను వేధిస్తున్న భర్తపై మొయినాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపల్లి గ్రామానికి చెందిన చీపిరి రాజుకు 2012లో నాగిరెడ్డిగూడకు చెందిన సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరితకు మరో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. సోదరులు లేకపోవడంతో పుట్టింటి నుంచి భూమి, ఇల్లు ఇప్పించాలని రాజు కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అతని బాధ భరించలేక కొంత కాలం క్రితం 6 గంటల భూమి ఇచ్చారు. అయినా ఇల్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో గత ఆదివారం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి అక్కడికి చేరుకున్న రాజు భార్యపై దాడిచేశాడు. దీంతో సోమవారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోక్సో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు
ఆమనగల్లు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా ఓ బాలికకు దగ్గరై మోసం చేసిన వ్యక్తికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్లుకు చెందిన వెంకటేశ్పై 2021లో పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన షాద్నగర్ పోక్సో కోర్టు నిందితుడికి పైశిక్ష విధిస్తూ తీర్పు వెలువర్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ కుషాల్కర్, ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్, కోర్టు కానిస్టేబుల్లు యాదయ్య, జగన్ నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు.

ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడికి సన్మానం

ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడికి సన్మానం