
పట్టుకోండి చూద్దాం!
పరిగి: వాహన తనిఖీల్లో పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాత్రి పట్టణ కేంద్రంలో సుల్తాన్పూర్ గేట్ సమీపంలో పోలీసులు డ్రంకెన్డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన ఓ బైక్పై కొడంగల్ నుంచి ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కనిపించడంతో పోలీసులు వారిని నిలువరించి తనిఖీ చేశారు. వారిని వద్ద ఉన్న సంచిలో ఏముందని అడగడంతో కంగారు పడ్డారు. వారి వద్ద నుంచి సంచిని లాక్కొని పరిశీలించగా నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు పోలీసులను తోసేసి సుల్తాన్పూర్ వైపు పొలాల్లోకి పరుగులు తీశారు. పోలీసులు వెంబడించినా వారి దొరక్కుండా పరారయ్యారు. అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. కర్ణాటక పాసింగ్ బైక్, నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రజాసంఘాల ఆగ్రహం
చేతికి చిక్కిన దుండగులు పోలీసుల కళ్ల ఎదుటే పరారవుతుంటే పట్టుకోవడంలో విఫలమయ్యారని ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పరిగి పరిసర ప్రాంతాల్లో నిత్యం చోరీల ఘటనలకు కారణం అంతరాష్ట్ర ముఠాలే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను పట్టుకోవాల్సిన పోలీసులు బురద, పొదలుండడంతో వెనుకడుగు వేశారని స్థానికులు వాపోతున్నారు. పరుగెత్తుతున్న వారిని పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చోరీలకా.. హత్యకా..?
సంచిలో కత్తులు, నాటు తుపాకీ, స్క్రూ డ్రైవర్లను తీసుకెళ్తున్న దుండగులు చోరీల కోసమా.. లేదంటే ఎవరినైనా హత్య చేసేందుకా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల చోరీలు, హత్యలు జరుగుతుండడంతో ఈ ఘటన వల్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైక్ నంబర్, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలు పరార్
పోలీసులను తోసేసిపొలాల్లోకి పరుగులు
బైక్, నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం
గాలింపు కొనసాగిస్తున్నాం
దుండగుల కోసం గాలింపు చర్యలు కొసాగిస్తున్నాం. వారి నుంచి నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్, బైక్ను స్వాధీనం చేసుకున్నాం. బైక్ నంబర్, టెక్నికల్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. – మోహన్ కృష్ణ, ఎస్ఐ, పరిగి

పట్టుకోండి చూద్దాం!