
నేటి నుంచి కొత్త ఆస్పత్రిలో వైద్య సేవలు
అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సోమవారం నుంచి కేవలం మాత, శిశు సేవలు మాత్రమే అందుతాయని.. మిగిలిన ఓపీ, ఐపీ సేవలు రాజీవ్నగర్ కాలనీ ఎదుట నిర్మించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంచంద్రయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ పరిసర మండలాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని వసతులతో మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని.. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు.
కుల వివక్షను
సహించేది లేదు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
బషీరాబాద్: కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. కులవివక్ష రూపుమాపే వరకు పోరాడుతామన్నారు. మండల పరిధిలోని బెల్కటూర్లో దళిత యువకుడు వినయ్కుమార్ వివాహం సందర్భంగా మే 18న పెళ్లి ఊరేగింపులో అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ యువకులు అడ్డుకుని దూషించారని ఆరోపించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. దళితులను అవమాన పరిచిన వారి అరెస్టు కోసం తాండూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపడతామని ప్రకటించారు. దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
11న ఇందిరమ్మ
ఇళ్ల ప్రొసీడింగ్స్
ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి
బషీరాబాద్: ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని 755 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పైలెట్ పంచాయతీ కాశీంపూర్కు 193 ఇళ్లు మంజూరవగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. మిగిలిన గ్రామాల నుంచి లబ్ధిదారులకు మంజూరైన పేదలకు ఈ నెల 11న బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రొసీడింగ్స్ అందజేస్తారని చెప్పారు.
మరకత శివాలయం సందర్శన
శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయాన్ని ఆదివారం జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాధా సతీష్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జాయింట్ కమిషనర్కి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. గతంలో శంకర్పల్లి మండలంలో నాలుగేళ్లు పని చేశానని అప్పుడు సైతం దర్శించుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.
నేటి నుంచి ప్రత్యేక లోక్ అదాలత్
చేవెళ్ల: ఈనెల 14వ తేదీ వరకు పాటు చేవెళ్ల కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ ఠాణా పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, మోకిల, షాబాద్ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు ఏమైనా పెండింగ్లో ఉంటే పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

నేటి నుంచి కొత్త ఆస్పత్రిలో వైద్య సేవలు

నేటి నుంచి కొత్త ఆస్పత్రిలో వైద్య సేవలు