
ఊరిలోనే విత్తనోత్పత్తి
కొడంగల్ రూరల్: సాగుకు అత్యంత కీలకమైన నాణ్యమైన విత్తనం కోసం రైతులు ప్రైవేటు కంపెనీలపై ఆధారపడకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏటా విత్తన ధరలు పెరుగుతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు నకిలీ విత్తనాల బెడదతో దిగుబడి రాక ఏటా వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నాణ్యమైన విత్తనం–రైతు నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కడా కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించారు. రాష్ట్రంలోని ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులు చొప్పున ఎంపిక చేసి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ వానాకాలం సీజన్లో వారు విత్తనోత్పత్తి చేసి వచ్చే సీజన్లో ఇతర రైతులకు అందించేందుకు కృషిచేయనున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులు విత్తనాల కోసం ప్రైవేటు కంపెనీలపై ఆధారపడుతుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు కంపెనీల విత్తనాలను విత్తుకోవడంతో ఆశించిన దిగుబడి రావడంలేదని, దిగుబడి రాని సమయంలో ప్రైవేటు కంపెనీలు పరిహారం ఇవ్వకపోవడంతో నష్ట పోయే అవకాశాలున్నాయి. ప్రైవేటు కంపెనీలపై ఆధారపడకుండా రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవడమే ఉత్తమ మార్గమని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది గ్రామాల్లో కొందరు రైతులను ఎంపికచేసి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు, వీరికి వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు అందించనున్నారు.
216 మంది రైతుల ఎంపిక
నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 216 మంది రైతులను ఎంపిక చేశారు. వరి పది కిలోల విత్తన రకం ఆర్ఎన్ఆర్ 1508, కంది రకం ఆశ ఐసీపీఎల్ నాలుగు కిలోల ప్యాకెట్, పాలెం పచ్చజొన్న నాలుగు కిలోల ప్యాకెట్ విత్తనాల కిట్లను ఎంపిక చేసి రైతులను అందజేస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు.
సాగుకు శాస్త్రవేత్తల సహకారం
విత్తన కొరత నివారించేందుకు ‘నాణ్యమైన విత్తనం–రైతు నేస్తం’
గ్రామాల వారీగా రైతుల ఎంపిక
మండలాల వారీగా రైతుల వివరాలు
మండలం రైతులు
కొడంగల్ 54
బొంరాస్పేట 51
దౌల్తాబాద్ 75
దుద్యాల్ 36
గ్రామానికి ముగ్గురు..
రాష్ట్రంలో రైతులకు విత్తన కొరతను నివారించడానికి ప్రొఫెసర్ జయశంక ర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాస్త్రవేత్తల సమక్షంలో పండించిన విత్తనాలను సేకరిస్తూ ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేస్తూ విత్తనాలు అందించేందుకు ఏర్పాటు చేశాం.
– శంకర్ రాథోడ్, ఏడీఏ, కొడంగల్

ఊరిలోనే విత్తనోత్పత్తి