
విధులపై అవగాహన పెంచుకోవాలి
అనంతగిరి: కొత్తగా ఉద్యోగాల్లో చేరిన హాస్టల్ వార్డెన్లు వీలైనంత త్వరగా విధులపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నూతనంగా ఎంపికై న ఎనిమిది మంది వసతి గృహ అధికారులకు మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లోని తన చాంబర్లో విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దే దిశగా పనిచేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మెనూ అమలు, ఆహార పదార్థాల నిల్వలు తదితర విషయాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. విద్యాశాఖతో అనుసరించాల్సిన విషయాలను డీఈఓ నుంచి అడిగి తెలుసుకోవాని సూచించారు. నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణపై ట్రెజరీ అధికారుల సూచనల ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీబీసీడీఓ ఉపేందర్, డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, డీటీఓ జార్సన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● అదనపు కలెక్టర్ సుధీర్