
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
● మహిళా అభ్యర్థులకు అవకాశం ● కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక ● డీఈఓ రేణుకాదేవి
అనంతగిరి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలరి డీఈఓ రేణుకాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్ పోస్టులు 6, ఏఎన్ఎం పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నుట్లు వివరించారు. కేజీబీవీ దోమ, బషీరాబాద్, కొట్పల్లి, పెద్దేముల్, చౌడపూర్, బొంరాస్పేటలో అకౌంటెంట్ పోస్టులు, కేజీబీవీ చౌడాపూర్, నవాబుపేట, అలాగే ముజాహిద్పూర్ ఆదర్శ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అకౌంటెంట్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ (ఎంఎస్ వర్డ్ – ఎక్సెల్) లేదా బీకాం కంప్యూటర్స్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం సర్టిఫికెట్(ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్) ఉండాలన్నారు. అకౌంటెంట్ కోసం కామర్స్ డిగ్రీ చేసిన వారికీ 75 శాతం, పీజీ ఎంకామ్ చేసిన వారికి 25శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏఎన్ఎం కోసం ఇంటర్, ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న వారికి 45శాతం, ప్రొఫెషనల్ క్వాలిఫికెషన్స్ ఉన్న వారికి (జీఎన్ఎం ట్రైనింగ్ 5 మార్కులు, బీఎస్సీ నర్సింగ్ 10 మార్కులు) అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుందని వివరించారు. 25 నుంచి 40 సంవత్సరంలోపు వయస్సు కలవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె తెలిపారు.