
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● పారిశుద్ధ్య పనులు చేపట్టండి అదనపు కలెక్టర్ సుధీర్
అనంతగిరి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎం.సుధీర్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో దోమల నుంచి సంక్రమించే వ్యాధుల నియంత్రణపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య లాంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, జ్వరం, దగ్గు, జలుబుకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిలవకుండా, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునే ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైద్యం, ఇతర సహాయం కోసం సెల్నంబర్ 9702705161లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీబీసీడీఓ ఉపేందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్, వివిధ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.