మోగనున్న బడి గంట | - | Sakshi
Sakshi News home page

మోగనున్న బడి గంట

Jun 12 2025 11:06 AM | Updated on Jun 12 2025 11:06 AM

మోగను

మోగనున్న బడి గంట

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
పండుగలా జరగాలి

వికారాబాద్‌: సుదీర్ఘ సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా విద్యార్థులను సమస్యలే స్వాగతం పలకనున్నాయి. వేసవి సెలవుల్లో ఆహ్లాదంగా గడిపిన చిన్నారులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు దాటినా విద్యార్థుల సమస్యలు తీరిన దాఖలాలు లేవు.. మన ఊరు – మన బడి, అమ్మా ఆదర్శ పాఠశాలలు లాంటి ప్రతిష్టాత్మక కార్యక్ర మాలు చేపట్టినా ఆశించిన మేర విద్యార్థులను ఆకర్శించలేకపోతున్నాయి. ప్రభుత్వ బడులలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా సమస్యలు కొలిక్కి రాలేదనే చెప్పాలి. ఇంకా వందకు పైగా పాఠశాలల్లో మరమ్మతులు అవసరమని అధికారులు తేల్చారు. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాకుండానే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చే విద్యార్థులకు కొంత మేర సమస్యలు తగ్గినప్పటికీ ఇంకా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఫలితాలు కనిపిస్తున్నా.. అకాడమిక్‌ విషయంలో పెద్దగా మార్పు కనిపించలేదనే చెప్పాలి.

నేడు పుస్తకాలు, దుస్తుల పంపిణీ

జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 80వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు స్కూళ్లకు చేర్చారు. విద్యార్థులకు యూనిఫారాలు సిద్ధంగా ఉంచారు. పాఠశాలల ప్రారంభం రోజునే వీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సారి నోటు పుస్తకాలను కూడా ఉచితంగా అందించనున్నారు. పాఠశాలల పర్యవేక్షణలో కీలక భూమిక పోషించే డిప్యూటీ డీఈఓ వ్యవస్థకు స్వస్తి పలకగా.. 20 మండలాలకు ఒక్క రెగ్యులర్‌ ఎంఈఓ కూడా లేకుండా ఇంచార్జులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ ప్రభావం ఫలితాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా చివరి వరుసలో నిలవడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇకనైనా పరీక్షల సమయంలోనే హడావుడి చేయకుండా అకాడమిక్‌ మానిటరింగ్‌ విషయంలోనూ దృష్టి సారించాలని విద్యాభిమాను లు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూనిఫాంల సిద్ధం

ఈ ఏడాది మొదటి విడతలో 79,049 యూనిఫారాలు అవసరమని ఇండెంట్‌ చేయగా ఇప్పటి వరకు 74,967 అంటే 95 శాతం పాఠశాలలకు చేర్చారు. 5,27,290 పాఠ్యపుస్తకాలు అవసరమని కాగా 4,84,211 అంటే 92 శాతం పాఠశాలలకు చేర్చారు. ఇక 5,79,894 నోటు పుసక్తకాలు అవసరమని కాగా 5,21,904 అంటే 92 శాతం బడులకు చేరవేశారు.

మౌలిక సదుపాయాలతో సరి

ఎప్పటిలాగే సమస్యలతో స్వాగతం

జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,063

విద్యార్థులు 80 వేల మంది

సమస్యలు లేకుండా చూడండి: కలెక్టర్‌

ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం పండుగ వాతావరణంలో జరగాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యునిఫారాలు మొదటి రోజే పంపిణీ చేయాలని సూచించారు.. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఆయన అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌, డీఈఓ రేణుకాదేవి, ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హెచ్‌ఎంలు, ఎంఈలకు పలు సూచనలు చేశారు. బడుల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పాఠశాలల ఆవరణలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పైకప్పులపై నీరు నిల్వ ఉంటే లేకుండా చేసుకోవాలన్నారు. ఆవరణ, పాఠశాల గదులు మొత్తం శుభ్రం చేసుకోవాలన్నారు. కిచెన్‌ షెడ్ల శుభ్రంగా చేయాలన్నారు. షెడక్లు లేకుంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. బియ్యం, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వాటర్‌ ట్యాంకులను క్లోరినేషన్‌ చేసుకోవాలని ఆసూచించారు. బడీడు పిల్లలందరూ పాఠశాలతో చేరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మోగనున్న బడి గంట1
1/1

మోగనున్న బడి గంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement