తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం మాజీ మంత్రి కొడాలి నాని, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కమిషనర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
టీడీపీ నేతల దాడి.. కేసు నమోదు
ఏర్పేడు: మండలంలోని మేర్లపాక పంచాయతీలో ఉన్న పుష్పిత్ ఐరన్ పరిశ్రమ సిబ్బందిపై మేర్లపాక మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు రమణారెడ్డి, అతని కుమారుడు గోపాల్రెడ్డి దాడి చేయడంతో వారిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మేర్లపాక పంచాయతీ పరిధిలోని పుష్పిత్ ఐరన్ పరిశ్రమలోకి వెళ్లేందుకు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, అతని కుమారుడు గోపాల్రెడ్డి ప్రయత్నించారు. గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మునికృష్ణయ్య అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితుడు మునికృష్ణయ్యతో ఫిర్యాదు చేయించారు. దీంతో ఏర్పేడు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డయాలసిస్ యంత్రాలకు విరాళం
పెళ్లకూరు: సీఎం చంద్రబాబుకు సోమవారం పెళ్లకూరుకు చాగణం లలితమ్మ, భాస్కరరావు మెమోరియల్ ట్రస్టు అధినేత చాగణం గౌరీశంకర్ రూ.35.45 లక్షల చెక్కును అందజేసినట్లు ట్రస్టు సీఈఓ పెనుబల్లి సీతారామనాయుడు తెలిపారు. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు అందుబాటులో చికిత్స అందించేందుకు గాను ట్రస్టు తరఫున నాలుగు డయాలసిస్ యంత్రాలు కొనుగోలు చేయడం కోసం తమవంతు విరాళం అందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో నాయుడుపేటకు విచ్చేసిన చంద్రబాబును చాగణం ట్రస్టీ గౌరీశంకర్ మర్యాదపూర్వకంగా కలిసి రూ35.45 లక్షల చెక్కును అంచారన్నారు.


