సాక్షి,టాస్క్ఫోర్స్: తరతరాలుగా పొలాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న దారులను గోతులు తీసి, కంచెలు వేసిన దుర్మార్గమైన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం మట్లువారిపల్లెలో చోటు చేసుకుంది. రెవెన్యూ, పోలీసులు అధికారులు ఈ దౌర్జన్య కాండను చూస్తూ మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 50 మంది రైతులకు చెందిన 80 ఎకరాల పంట పొలాలకు వెళ్లే 5 రోడ్లను జేసీబీలతో కందకాలు తవ్వి, మట్టి కుప్పలని అడ్డంగా పోశారు. అయినా వెళతారనే అనుమానంతో కంచెలు కూడా వేయడం దుర్మార్గమని రైతులు వాపోతున్నారు. దారులు మూసివేయడంతో రైతులు సకాలంలో వారి పొలాలకు వెళ్లాలన్నా.. పంట ఉత్పత్తులను ఇంటికి తెచ్చుకోవాలన్నా.. పశువులను పొలాల దగ్గరికి తీసుకుపోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నించినా వారు మౌనంగా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డికి సమీప బంధువులమని రాజకీయ కక్షతోనే తమ పంట పొలాలకు పోనీయకుండా అధికారుల అండతో గోతులు తీశారని సంబంధిత రైతులు వాపోయారు. కేవలం గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా ఉండడం, ఓటు వేయడమే కారణమని వారు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసుల ఎదుటే టీడీపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులపై రెవెన్యూ, పోలీసు టీడీపీ నాయకులు చేస్తున్న పనులను చూసి ఇప్పటికే అనేక మంది రైతులు తమ పొలాలను పంటలు వేసుకోవడానికి కూడా భయపడుతున్నట్లు వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.


