ఓబులవారిపల్లె: ఆకతాయి చేష్టలతో అరటితోట కంచెకు నిప్పు పెట్టడంతో దాదాపు ఆరు వేల అరటి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదైన ఘటన ఓబులవారిపల్లె మండలంలో చోటు చేసుకుంది. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని గ్రామ సమీపంలోని కొత్తపిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఇందులో అమృతపాణి రకం అరటితోటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అరటి గెలలు కోతకు వచ్చాయి. కొన్ని రోజుల్లో కాయలు విక్రయించుదామని ఆశగా ఉన్నారు. అయితే శుక్రవారం కొందరు ఆకతాయిలు తోటకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి తోట పూర్తిగా కాలి బూడిదయ్యింది. మంటలు పక్కనే ఉన్న నిమ్మ చెట్లకు కూడా వ్యాపించడంతో అవి కూడా కాలిబూడిదయ్యాయి. అలాగే డ్రిప్పు పైపులు కాలిపోయాయి. బాధితుల స్వగ్రామం పుల్లంపేట మండలం, కొమ్మనవారిపల్లి పంచాయతీ, వల్లూరుపల్లి. చుట్టు పక్కల వారు మంటలను చూసి రైతులకు సమాచారం ఇవ్వగా వారు పొలం వద్దకు వచ్చి చూసేసరికి పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆరు వేల అరటిచెట్లు కాలిపోవడంతో దాదాపు రూ.10 లక్షల మేర పంట నష్టం వాటిల్లింది.


