తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో సోమవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 700 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సివిక్స్ పేపర్–1పరీక్షకు
345 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లాలోని 84 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ సివిక్స్ పేపర్–1 ప్రశాంతంగా జరిగిందని ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సివిక్స్ పరీక్షకు జిల్లాలో 4,885 మందికి గాను 4,540 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 345 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే సోమవారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మోడరన్ లాంగ్వేజ్ పేపర్–2తోపాటు జాగ్రపీ పేపర్ పేపర్–2 పరీక్ష జరగనుందని తెలిపారు.
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్
త్వరితగతిన పూర్తి చేయండి
నాయుడుపేట టౌన్: పట్టణంలోని బిరదవాడ సమీపంలో నూతనంగా నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కె వెంకటేశ్వర్ సూచించారు. స్థానిక మున్సి పల్ కార్యాలయంలో కమిషనర్ షేక్ ఫజులుల్లాతోపాటు మెప్మా, టిడ్కో పలువురు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టిడ్కో గృహాలు ప్రారంభం కావాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 430 చదరపు అడుగులు సంబంధించి 288 గృహాలు, 365 చదరపు అడుగులకు సంబంధించి 624, 360 చదరపు అడుగులకు సంబంధించి 1,152, మొత్తం 2,064 గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉందని కమిషనర్ జిల్లా కలెక్టర్కు వివరించారు. దీంతో ఇప్పటి వరకు 1100 గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, మిగిలిన గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి అభివృద్ధి పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వీలైతే ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం పర్యటన ఉండవచ్చని కలెక్టర్ వెల్లడించారు.


